నరసన్నపేట 'దేశం'లో అసంతృప్తి
Published on: Sat Apr 28, 2012 10:12AM
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టును సిమ్మా స్వామిబాబుకు ఇవ్వటంతో ఆ పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. టిక్కెట్టును ఆశిస్తున్న మిగిలిన నాయకులు బాహాటంగానే పార్టీపై తిరుగుబాటును ప్రకటించారు. ఈ ప్రాంతంలోని ముఖ్యనాయకులైన బగ్గు లక్ష్మణరావు, బగ్గు రామకృష్ణ తదితరులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరితో పాటు అనేకమంది మండల, గ్రామస్థాయి నాయకులు కూడా తెలుగుదేశంపార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన ఈ చిచ్చు ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. ఇదే అదునుగా భావించిన మంత్రి ధర్మానప్రసాదరావు ఈ నాయకులతో మాట్లాడి కాంగ్రెస్ లో చేరవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికితే వచ్చే రెండేళ్ళలో వారి పరిథిలోని గ్రామాల అభివృద్ధికి పెద్దఎత్తున నిథులు కేటాయిస్తామని ధర్మాన వాగ్థానం చేస్తున్నారు. దీంతో మండలస్థాయిలోని అనేకమంది టిడిపి నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికేందుకు సిద్ధపడుతున్నారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా టిడిపి మాత్రం విభేదాలతో వెనుకబడి వుంది.


