శాడిస్టు బాస్.. వాళ్ళ బాధను రెట్టింపు చేస్తున్న జగన్!

 

ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్ల పేరుతో వైసీపీ సానుభూతిపరులకు ఉద్యోగాలు ఇచ్చి, ఎందరినో రోడ్డుపాలు చేస్తుందని.. టీడీపీ నేత నారా లోకేష్ కొద్దిరోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ వాలంటీర్ల పుణ్యమా అని రేషన్ డీలర్లు, మీ సేవ సిబ్బంది, ఆశా వర్కర్లు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా ఇదే విషయమై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కార్ పై విమర్శల దాడి చేశారు. 

"అనగనగా ఒక శాడిస్టు బాస్, ఉద్యోగిని పిలిచి 'నీకు జీతం రెట్టింపు చేశా' అన్నాడట. అతను సంతోషిస్తూ కృతజ్ఞతలు చెబుతుంటే, 'నీకింకో విషయం చెప్పాలి, నిన్ను ఉద్యోగం నుంచి తీసేసా' అన్నాడట. 'మరలాంటప్పుడు నాకు జీతం ఎందుకు పెంచారు' అని అడిగితే ఉద్యోగం పోయిన బాధ నీకు రెట్టింపు చేయడానికి అన్నాడట. వైఎస్ జగన్ గారు కూడా అదే చేస్తున్నారు. యానిమేటర్లకు జీతం పదివేలు అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కనీసం ఒక్క నెలయినా పెరిగిన జీతం ఇవ్వకుండా గ్రామ వాలంటీర్లను వారి మీదికి పంపి మీ ఉద్యోగాలు ఊడపీకారు పొమ్మంటున్నారు. ఒక ఉద్యోగం ఇవ్వడానికి పది ఉద్యోగాలు పీకడం... ఏంటీ అన్యాయం జగన్ గారూ?" అని లోకేష్ విమర్శించారు.