పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?

ఏపీ నుంచి తమిళనాడుకు వెళుతూ, చెన్నై సమీపంలో పట్టుబడిన ఓ కారులో రూ. 5 కోట్లకు పైగా డబ్బులు పట్టుబడటం, ఆ కారుపై మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ స్టిక్కర్ ఉండటం కలకలం రేపుతోంది. వైసీపీ నేతల అక్రమ సంపాదనకు ఇది నిదర్శనం అంటూ ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

"వైఎస్ జగన్ గారి సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడు లో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే యుశ్రారైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందొ అర్థం అవుతుంది." అని లోకేష్ విమర్శించారు.

"ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?" అని లోకేష్ ప్రశ్నించారు.