అపుడు తమరు గుడ్డి గుర్రాల పళ్ళు తోముతున్నారేమో: జగన్ పై లోకేష్ విసుర్లు

 

 

 

ఈరోజు ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విపక్షాల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ వెళ్లడాన్ని టీడీపీ అసెంబ్లీలో తీవ్రంగా తప్పు పట్టింది. ఈ సందర్బంగా  సీఎం జగన్ మాట్లాడుతూ సీఎం గా చంద్రబాబు ఉన్నపుడే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని అప్పుడు బాబుగారు గాడిదలను కాశారా  అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? అని వైఎస్ జగన్ గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో ఈ రోజు అసెంబ్లీలో అడిగారు. ఇది జూన్ 21, 2018న మీ అవినీతి 'సాక్షి' లో వచ్చిన వార్త (ఆ వార్తను షేర్ చేస్తూ). అలాగే మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా చూడవచ్చు. కాళేశ్వరంపై అప్పుడు చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేసిన వార్త పేపర్లలో వచ్చింది. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారేమో, ఇలాంటివి చూసే టైం ఉండి ఉండదు’’ అంటూ లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చూద్దాం ఈ విమర్శల యుద్ధం ఇంతటితో ఆగుతుందా లేక ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే సరికి మరింత ముదురుతుందా వేచి చూడాలి.