స్కూలు బస్సు ప్రమాద బాధితులకు లోకేష్ పరామర్శ

 

మెదక్ జిల్లా మాసాయిపేట దగ్గర స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంఘటనలో మరణించిన చిన్నారుల కుటుంబాలను తెలుగుదేశం యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబాలకు సరైన నష్టపరిహారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. మరణించిన చిన్నారుల కుటుంబలకు ఆర్థిక సాయం అందించడానికి ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్, గన్‌పూర్, వేలూరులలో లోకేష్ పర్యటించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కో చిన్నారి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే మరణించిన చిన్నారుల కుటుంబలోని పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలలో ఉచితంగా విద్యాబోధన చేస్తామని, వారు ఎంతవరకు చదువుకున్నా ఆ బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని లోకేష్ ఈ సందర్భంగా ప్రకటించారు.