అవినీతి పుత్రుడు జగన్.. మోదీ దత్తపుత్రుడు పవన్.!!
posted on Jul 11, 2018 11:41AM
జగన్, పవన్ లు సీఎం చంద్రబాబు మీదే కాదు.. మంత్రి లోకేష్ మీద కూడా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.. అయితే తాజాగా లోకేష్.. జగన్, పవన్ లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేష్.. బహిరంగ సభల్లో మాట్లాడారు.. 2014 లో రాష్ట్రాన్ని అడ్డంగా విభజించారు.. ఆర్థిక కష్టాల నడుమ పాలన బాధ్యతలు చేపట్టిన మన చంద్రన్న ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.. అందుకే అభివృద్ధి పుత్రుడు చంద్రన్న అయితే.. అవినీతి పుత్రుడు జగన్.. ప్రధాని మోదీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం వెన్నుపోటు పొడిస్తే.. జగన్, పవన్ ప్రధానిని ఒక్కమాట అనరని.. ఆయనను ఏమైనా అంటే జైలుకెళ్తాననే భయంతో జగన్ నోరెత్తడం లేదని అన్నారు.. పవన్ నాపై వ్యక్తిగత విమర్శలు చేశారు.. ఆయనకు సవాల్ విసురుతున్నా.. దమ్ము ధైర్యం ఉంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసారు.. అదే విధంగా '2019 ఎన్నికల్లో అసలు సిసలైన సినిమా ఉంటుంది.. భారీ మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారు’ అని స్పష్టం చేసారు.