వైఎస్ జగన్ గారూ.. ఇదేనా మీకు చేతనైన పరిపాలన?

 

నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ నేతలకు చెందిన మూడు ఇళ్లను రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతుండగా.. తాము సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించామని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదంతా వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై తాజాగా నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

"కూల్చడాలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోంది. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టీడీపీ నాయకులకు చెందిన 3 ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో కూల్చేశారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం వైసీపీ దౌర్జన్యాలకు అండగా నిలుస్తుండటం దురదృష్టకరం." అని లోకేష్ విమర్శించారు.

"కక్షసాధింపులు, కూల్చడాలు.. ఇదేనా మీకు చేతనైన పరిపాలన వైఎస్ జగన్ గారూ? అధికారం మీకు శాశ్వతం కాదు గుర్తుంచుకోండి." అంటూ లోకేష్ మరో ట్వీట్ లో హెచ్చరించారు.