పలకరింతలు.. పులకరింతలు.. నారా లోకేష్ ఆత్మీయ విందు
Published on: Tue Feb 24, 2026 2:31PM

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రతినిథులకు ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం (ఫిబ్రవరి 23) ఇచ్చిన ఆత్మీయ విందు నవ్వుల విందుగా, పరిచయాలు, పలకరింపుల మేళవింపులుగా మారింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పరస్పరం కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు. తమతమ ప్రాంతాల ప్రత్యేకతలను పంచుకున్నారు.

శ్రీకాకుళం వెటకారం, విజయనగరం చతురతతో సంభాషణలు రక్తి కట్టాయి. మంత్రి నారా లోకేష్ ఈ విందు సమావేశంలో మంగళగిరి చేనేత ప్రమోషన్ చేస్తూ శ్రీకాకుళం ప్రజాప్రతినిథులు పొందూరు ఖాదీతో బదులిచ్చారు. ఆత్మీయ వేదికకు హాజరైన ప్రజాప్రతినిథుల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలు లోకేష్ బహుకరించారు.
ఈ ఆత్మీయ విందు సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామమోహన నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి సాయి శ్రీనివాస్, కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలి ఆర్ఎస్వీకేకే రంగారావు బేబీనాయన, కిమిడి కళా వెంకటరావు, పి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం మాధవి, నడికుదిటి ఈశ్వరరావు కుటుంబసభ్యులతో హాజరయ్యారు.


