TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా బ్రహ్మణి నో

Published on: Tue Dec 16, 2025 11:39AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన ఉచ్ఛారణతో తెలుగులో ఆమె చేసిన ప్రసంగం, రాజకీయాలపై ఆమెకు ఉన్న అవగాహనను ప్రస్ఫుటం చేసింది.

దీంతో అప్పట్లో తెలుగుదేశం కు నారా బ్రహ్మణి బ్రహ్మాస్త్రం అంటూ తెలుగుదేశం శ్రేణులు పేర్కొన్నాయి. విశ్లేషకులు సైతం ఆమె రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా బ్రహ్మణి స్వయంగా తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన ప్రథమ ప్రాధాన్యత హెరిటేజ్ ఫుడ్స్ మాత్రమేనని చెప్పారు. 

 బిజినెస్ టుడే  ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ -2025 కార్యక్రమంలో బ్రాహ్మణి  పాల్గొని ప్రసంగించారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా  సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందన్న ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కాగా కార్యక్రమ నిర్వాహకులు ఒక వేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాలలోకి రావాల్సిందిగా కోరితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు.. నారా బ్రహ్మణి రాజకీయాలు తనకు  ఆసక్తికరమైన రంగం కాదని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమ రంగంలో  లక్షల మంది మహిళా రైతులు, కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశం తనకు లభించిందని, అటువంటి అవకాశాన్ని తాను వదులుకోదలచుకోలేదని బ్రాహ్మణి అన్నారు.