మా రాముడిచ్చిన రామయ్య విగ్రహానికి... అయోధ్య రాముణ్ణి ప్రతిష్టించిన మోదీ పూజలు
Published on: Mon May 11, 2026 11:03AM

ప్రధాని మోదీతో ఆత్మీయ సమావేశంపై నారా భువనేశ్వరి ట్వీట్
రాజకీయ హడావుడి లేదు. ప్రైవేటు కెమెరాల సందడి లేదు. ఒక కుటుంబ సభ్యుడిలా, ప్రధాని నరేంద్ర మోడీ నారా వారి లోగిలిలో అడుగుపెట్టారు. దాదాపు గంట సేపు ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి నివాసంలో గడిపారు. మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆదివారం (మే 10) సీఎం నారా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ అరుదైన, అత్యంత భావోద్వేగపూరితమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.
ప్రధాని మోదీకి నారా కుటుంబంలోని మూడు తరాల వారు అంటే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా దేవాన్ష్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆ సందర్భంగా అది ప్రధాని పర్యటనలా కాకుండా.. ఒక కుటుంబ వేడుకగా అనిపించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నందమూరి తారకరామారావు నారా వారి కుటుంబానికి బహుకరించిన శ్రీరామ చంద్రమూర్తి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


