TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రులకు టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు..? ఏ క్షణమైనా..?

Published on: Thu Aug 31, 2017 11:11AM

నంద్యాల బై పోల్ రిజల్ట్‌‌ ఎలా వచ్చినా సరే అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అది నిజమైందని చెప్పవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..ముఖ్యంగా జగన్మోహన్‌రెడ్డి పరపతి తదితర అంశాలు నంద్యాలలో స్పష్టంగా కనిపించాయని..అన్ని చోట్లా కాకపోయినా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజానాడి ఇలాగే ఉందని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా నంద్యాల విజయాన్నే ప్రచార అస్త్రంగా మలచుకుని టీడీపీ ముందుకు వెళ్తుందని అంచనా..అదే జరిగితే అధికార పార్టీ దూకుడును వైసీపీ తట్టుకొని నిలబడగలుగుతుందా..? మరి మా రాజకీయ భవిష్యత్తు ఏంటా అని ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతల్లో భయం పట్టుకుందట.

 

దీంతో ఇక్కడ దుకాణం సర్దేసి తెలుగుదేశంలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మంత్రిగారు తనకు సన్నిహితులైన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీగా మాట్లాడుతున్న వేళ ఆయన ఫోన్ రింగ్ అయ్యిందట. అప్పటి వరకు హుషారుగా కబుర్లు చెప్పిన సదరు మంత్రిగారు ఆ ఫోన్ వచ్చి రావడంతోనే లోపలికి వెళ్లి సుమారు 30 నిమిషాల తర్వాత బయటికి వచ్చారట. ఏంటీ సార్ మేటర్ అని అడిగితే..ఏముందయ్యా..? "వలసలు మళ్లీ స్టార్ట్" అన్నారట..

 

అంటే దాని అనర్థం వైసీపీ ఎమ్మెల్యేలు సైకిలెక్కేందుకు సైలెంట్‌గా ప్లాన్లు వేసుకుంటున్నట్లేగా..ఈ ఒక్క మంత్రికే కాదు..తమకు బాగా పరిచయమున్న అమాత్యులకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా ఫోన్లు చేస్తున్నారట. తాము టీడీపీలోకి వస్తే తమను ఎలా ట్రీట్ చేస్తారు..? టికెట్ కన్ఫర్మా కాదా..? ఇలా ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి వచ్చేటప్పుడు చర్చించుకోవాల్సిన అన్ని విషయాలు చర్చించుకుంటున్నారట. మరోవైపు తమ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించబోతున్న విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో పడింది. మరి హైకమాండ్ బుజ్జగింపులకు వారు మెత్తబడతారో లేదో వేచి చూడాలి.?