మీకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. రఘురామరాజుకు ఎంపీ నందిగం సురేష్ వార్నింగ్

వైసీపీకి.. ఆ పార్టీ ముఖ్య నేతలకు కొరకరాని కొయ్యగా తయారై ప్రతి నిత్యం ఇటు సొంత పార్టీ పైన.. అటు ముఖ్య నాయకుల పైన రఘురామకృష్ణం రాజు చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ రఘురామ రాజుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు సాయంత్రం పార్లమెంట్ సమావేశాల తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన రఘురాజు చేసిన ప్రతి విమర్శకు కౌంటరిచ్చారు.

 

నందిగం సురేష్ మీడియాతో మాట్లాడిన విషయాలు అయన మాటల్లోనే.. "దళిత ఎంపీగా ఉన్న నన్ను ఉద్దేశించి, నా కుల వృత్తిని ఉద్దేశించి వైసీపీ ఎంపీగా గెలిచి, పార్టీ పైన నిత్యా విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామ రాజు అవహేళన చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులైన రాములుకు ఫిర్యాదు చేశాను. దళితులైన చర్మ కార్మికుల పట్ల ఉన్న ద్వేషంతో, అసూయతో, ఆహంకారంతో మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా కోరాను. దీనికి సంబంధించి కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ నెల 17న రఘురామ రాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నన్ను ఉద్దేశించి దళిత జాతిని అవమానించే విధంగా చెప్పులు కుట్టుకునే వాడు అని.. మా జాతి పశువుల చర్మాలు వలుస్తుందని, తోళ్ళు వలిచే వృత్తి అంటూ దళిత జాతిపై ద్వేషం, పగతో రగిలేలా అహంకారంతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు రోజూ పెట్టే ప్రెస్ మీట్లలోనూ ఇదే అహంకారంతో, దళితులపై ద్వేషంతో మాట్లాడుతున్నాడు. దళితులపై రఘురామకృష్ణరాజు కక్ష కట్టినట్టుగా, వ్యంగంగా, హేళనగా, గుండెల నిండా పగ పెంచుకున్నట్టుగా మాట్లాడిన మాటలు చూస్తే.. ఆయనకు దళితులంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుంది. నేను ఆయనను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం లో దళితులు ఓట్లేస్తేనే రఘురామ రాజు ఎంపీ అయ్యాడు. ఈయనేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు" అని రెబల్ ఎంపీ రఘురామ రాజు వ్యాఖ్యలకు బాపట్ల ఎంపీ సురేష్ కౌంటరిచ్చారు.

 

"తన సెక్యూరిటీతో తోలు వలిపిస్తాను, కాల్పిస్తాను అని రఘురామకృష్ణరాజు దళితులను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారు. దళితులను కాల్చడానికి, దళితుల చర్మం వలవడానికి మీకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీని సమకూర్చలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. మీకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది. దళితుల పట్ల పగతో రగిలిపోతూ, సెక్యూరిటీని అడ్డుపెట్టుకుని దళితులను బెదిరించేందుకు సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్న రఘురామ రాజుపై లోక్ సభ స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాను. ఆయనకు కేటాయించిన సెక్యూరిటీని కూడా తొలగించమని కోరబోతున్నాను" అని సురేష్ మీడియా ముఖంగా తెలిపారు.

 

"మా దళిత కులాలు, దళిత జాతి అంటే చిన్నచూపు చూస్తూ, ఏహ్యభావంతో మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు మాటలను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న దళిత ప్రజలు, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని దళితులంతా చూశారు. రఘురామ రాజుకు తగిన బుద్ధి చెప్పటానికి దళితులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆయన దళిత జాతికి క్షమాపణలు చెప్పి, ముక్కు నేలకు రాసి, ఆ తర్వాతే పార్లమెంట్‌లో అడుగు పెట్టాలి. రఘురామ రాజు పార్లమెంట్‌లో అడుగు పెట్టేముందు ఒకసారి నర్సాపురం నియోజకవర్గం వెళ్ళి వస్తే దళితుల సత్తా అంటే ఏమిటో తెలిసేది. ఉట్టికి ఎగరిలేనమ్మ అన్నట్టు.. సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే ధైర్యంలేని రఘురామ రాజు పులివెందులలో పది వేల మందితో మీటింగ్ పెడతానని అయన ప్రగల్భాలు పలుకుతున్నారు. అడవిలో మొరగడానికి, వీధుల్లో మొరగడానికి చాలా తేడా ఉంటుందన్న విషయం అయన గుర్తుంచుకుంటే మంచిది" అని ఎంపీ సురేష్, రఘురామ రాజును ఎద్దేవా చేసారు.

 

"అంతేకాకుండా రఘురామ రాజు భవిష్యత్తు ఏంటో త్వరలోనే తెలుస్తుంది. ఆయన ఎవరితో ఆడుకోకూడదో వారితోనే ఆటలు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వారి ఆట ఎలా ఉంటుందో.. అతి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ రూపంలో తెలుస్తుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. త్వరలో కచ్చితంగా తన ఒరిజనల్ స్టేజికి.. ఇటు పదవి విషయంలోగానీ, అటు విగ్గు విషయంలోగానీ రఘురామ రాజు వస్తారు. ఢిల్లీలో ఉండి రోజూ చెట్టు కింద ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీని, సీఎం జగన్ గారిపై విమర్శలు చేస్తూ చివరికి జోహార్ సీఎం అంటూ బుద్ధి లేకుండా మాట్లాడిన ఆయన రాజకీయ విలువలు పాటించడంలో పాతాళానికి దిగజారాడు. అసలు రఘురామ రాజుకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో.. ఏ బ్యాంకులను లూటీ చేశాడో.. ఇవన్నీ బయటకు రావాలి. కేవలం వీటన్నింటినీ సర్దుకోవడానికే ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని అయన ఢిల్లీ వీధులో తిరుగుతున్నారు" అని రఘురామరాజు పై సురేష్ విరుచుకు పడ్డారు.