ఎన్టీఆర్ నటించలేదు.. భారత రత్న ఇవ్వాలి..
posted on May 28, 2016 12:37PM
తిరుపతిలో టీడీపీ మహానాడు కార్యక్రమం రెండో రోజు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి.. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రసంగం ప్రారంభించారు. ఆంధ్రుల ఆరాధ్య దైవంగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ఉన్నతమైన ఆశయాల కోసం జీవించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తే సాధించలేనిది ఏది లేదని.. ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డ్ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అన్న క్యాంటీన్లను ప్రారంభిచనున్నామని తెలిపారు. సినిమాల్లో ఎంతగా గౌరవం సంపాదిస్తారో మళ్లీ అంతగా రాజకీయాల్లో సంపాదించే అవకాశం ఉండదు.. కానీ, ఆ ఘనతను ఎన్టీఆర్ సాధించార’ని అన్నారు. ‘ఎన్టీఆర్ సినిమా పాత్రల్లో నటించలేదు జీవించారు’ అని చంద్రబాబు అన్నారు. ఏ వేషమేసినా ఆ పాత్రకి న్యాయం చేశారని ఆయన అన్నారు. శ్రీ కృష్ణుడ్ని మన కళ్లకు చూపించారని వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 115.5 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.