బాబుకి షాకిచ్చిన హరికృష్ణ వర్గం.
Published on: Tue May 1, 2012 10:16AM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కృష్ణాజిల్లాలోని హరికృష్ణ వర్గీయులు షాకుల మీద షాకులిస్తున్నారు. గతంలో హరికృష్ణ వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనీ, రచ్చకెక్కిన ఈ వర్గీయులు తాజాగా జగన్ తో సన్నిహితంగా మెలుగుతూ షాకునిచ్చారు. గుంటూరు ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) విజయవాడ టిడిపి అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ, హరికృష్ణ వర్గీయులుగా ముద్రపడ్డారు.
హరికృష్ణకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతున్నదంటూ బహిరంగంగానే గతంలో ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఈ ఇద్దరు నాయకులూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో జగన్ వీరిద్దరి పట్ల ఆసక్తి చూపినట్లు తెలిసింది. జగన్ వ్యూహంలో భాగంగానే ఇటీవల వల్లభనేని వంశీ విజయవాడలో ఆయన్ను బహిరంగంగానే కలుసుకున్నారు. కొడాలి నాని ఇంకా తన అభిప్రాయాలను బయటపెట్టక పోయినా ఆయన కూడా జగన్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. పార్టీ అధినాయకత్వ వైఖరిలో మార్పు రావడంతో పాటు చేసిన తపును గుర్తించి తమకు సముచిత స్థానం ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూసుకున్తామన్న సంకేతాలను పార్టీ అధినేతకు ఇచ్చే ఉద్దేశ్యంతోనే ఈ ఇద్దరు నాయకులూ జగన్ అస్త్రాన్ని సందిన్చినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలు చంద్రబాబునాయుడుకు ఇబ్బందికరంగానే మారాయి. గుడివాడలో కొడాలి నాని తెలుగుదేశంపార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. మరోవైపు వంశీకి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దసఖ్యలో అనుచరగణముంది. వీరిద్దరినీ దూరం చేసుకుంటే కృష్ణాజిల్లాలో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.


