కాంగ్రెస్ లోకి నామ.. ఖమ్మం ఎంపీగా పోటీ

 

తెలంగాణ టీడీపీలో ఉన్న ఒకరిద్దరు బలమైన నేతలు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా.. మరో సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా టీడీపీని వీడబోతున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో నామ నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆయనకు కాంగ్రెస్‌ నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు అంగీకరించిన నామ కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమైనట్లు సమాచారం. కాంగ్రెస్ తరపున ప్రస్తుత ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగుతారని కూడా ఈమధ్య వార్తలొచ్చాయి. టీఆర్ఎస్ పొంగులేటికి టికెట్ నిరాకరించిందని, కాంగ్రెస్ రంగంలోకి దిగి తమ పార్టీ తరపున బరిలోకి దిగమని పొంగులేటి ఆఫర్ చేసిందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా నామ నాగేశ్వరరావు పేరు తెరమీదకు వచ్చింది. మరి ఖమ్మం ఎంపీ సీటును ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దింపుతుందో చూడాలి.