పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న దివీస్, శ్రీని కంపెనీలు
Published on: Thu Apr 26, 2012 10:46AM
నల్గొండ జిల్లా చౌటుప్పల్ పరిసర ప్రాంతాలను దివీస్, శ్రీని మందుల తయారీ కంపెనీలు కలుషితం చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ రెండు కర్మాగారాలకు ఎఫ్యులెంట్ ట్రీట్ మెంట్ ప్లాంటులు ఉన్నాయి. కానీ, వీటి నిర్వహణకు ఖర్చు ఎక్కువవుతుంది.
అందువల్ల ఈ కంపెనీలు వీటిని వాడకుండా వ్యర్థాలను అక్రమంగా భూమిలో నిల్వ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయడం, తగలపెట్టడం వంటి పద్ధతులను అవలభిస్తున్నాయన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దివీస్ మరో ముందడుగు వేసి ప్లాంటు నుంచి వెలువడే ప్రమాదకర వ్యర్థాలను విశాఖపట్టణంలోని తమ రెండో యూనిట్ కు తరలిస్తున్నదని అక్కడి నుంచి ఈ వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా సముద్రజలాల్లో కలిపెస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
ఈ రెండు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ రసాయన కాలుష్యాన్ని తరలించేందుకు స్తానికులనే ఈ రెండు కర్మాగారాలు ఏజెంట్లుగా పెట్టుకున్నాయి. చౌటుప్పల్ తో పాటు చిట్యాల, పోచంపల్లి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వందమంది ఈ వ్యవహారంలో నిమగ్నమై ఉన్నారు. నిత్యం ఈ రెండు ప్లాంట్ల నుంచి పది, పదిజేను ట్యాంకర్ల ద్వారా వ్యర్థ రసాయనాలను రాత్రి వేళల్లో తరలించి నిర్మానుష్యమైన అటవీ ప్రాంతాల్లో పారబోస్తున్నారు. 12 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక్కో ట్యాంకరు తరలించేందుకు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ముట్టజెపుతున్నారు. ఈ పరిశ్రమలు లాభాపేక్షతో పర్యావరణానికి తీవ్రమైన ముప్పుతెస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.


