లోక్ సభకు చంద్రబాబు!!
posted on Dec 19, 2013 10:16AM
తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ఏర్పాటుతో వాటిలో ఏదో ఒకదానికి పరిమితం కావడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి వచ్చే ఎన్నికల్లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లోకసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన సమయం లేనందున అసెంబ్లీకి కాకుండా కేవలం లోక్సభకు మాత్రమే ఎన్నికలు జరిగితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లోక్సభకు పోటీచేసే అవకాశముందనే ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.
చంద్రబాబు ఇప్పటిదాకా లోక్సభకు ప్రాతినిధ్యం వహించలేదు. ఆరుసార్లుగా అసెంబ్లీకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా కుప్పం నుంచే పోటీకి సన్నాహాలు చేసుకొంటున్నారు. కానీ అసెంబ్లీకి ఆగి, లోక్సభకు మాత్రమే ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఎంపీగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీలకు దీటుగా తెలుగుదేశం పార్టీ సత్తా చాటడానికి వ్యూహరచన చేసుకుంటోంది. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ సీమాంధ్రపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. కేవలం లోక్సభ ఎన్నికలు జరిగితే సినీ హీరో బాలకృష్ణ కూడా సీమాంధ్రలో ఒక చోటి నుంచి లోక్సభకు పోటీచేసే అవకాశముందని, బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి అత్యధిక సీట్లు గెలుచుకోవడమే టీడీపీ వ్యూహమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.