రెండో రోజుకు చేరిన చంద్రబాబు ఢిల్లీ దీక్ష
posted on Oct 8, 2013 12:05PM
రాష్ట్రవిభజనపై కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ డిల్లీలో చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. చంద్రబాబు మాట్లుడుతూ..రాజకీయాలు చేయడానికి తాను నిరవధిక దీక్ష చేపట్టలేదని స్పష్టం చేశారు. తెలుగువారి కోసం దీక్ష చేయాలంటే తాను ఇటలీ మహిళ పరిమిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పరిస్థితులను వివరించి వాటిని సరిద్దిద్దామని రాష్ట్రపతిని కోరినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కేంద్రం, సీమాంధ్ర ప్రజల ఆందోళన పట్ల కనీస స్పందన చూపకపోవడం వలనే నేడు రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయని తెలిపారు.
కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయకోణం నుండే పరిష్కరించాలని ప్రయత్నించుతున్నందున, అది తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్, షిండే వంటి కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు పొంతన లేని విధంగా మాట్లాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలని ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన ప్రశ్నించారు.