జనసేనలో చేరిన నాగబాబు.. ఎంపీ టికెట్ ఖరారు

 

సినీ నటుడు నాగబాబు జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కళ్యాణ్ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా నాగబాబు జనసేన తరపున బరిలోకి దిగనున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు పవన్‌ బీ-ఫారాన్ని కూడా అందజేశారు. నాగబాబు జనసేనలో సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజకీయాలకు సంబంధం లేకుండా తనదైన జీవితం గడుపుతున్న వ్యక్తిని తాను స్వయంగా పార్టీకి రావాల్సిందిగా ఆహ్వానించానని తెలిపారు. తనలో రాజకీయ చైతన్యం మొదలైంది తన సోదరుడు నాగబాబు వల్లేనని చెప్పారు. దొడ్డి దారిలో కాకుండా ధైర్యంగా తన అన్నయ్యను నేరుగా ప్రజాక్షేత్రంలో నిలబెడుతున్నానని తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నాగబాబు అని చెప్పారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఆయన విజయం సాధిస్తారనే నమ్మకం తనలో ఉందని పవన్ అన్నారు. అదేవిధంగా నాగబాబు మాట్లాడుతూ.. వరుసకు తమ్ముడే అయినా తనకు కూడా పవన్‌ నాయకుడేనని నాగబాబు అన్నారు. టికెట్‌ ఇచ్చినందుకు సోదరుడు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ్ముడి స్ఫూర్తితో సత్తా చూపిస్తామన్నారు.