కడప జిల్లాలో హత్యల కలకలం.. ఉన్మాదానికి ఒకరు.. కక్షలకు మరొకరు బలి!
Published on: Sat Apr 11, 2026 10:04AM
.webp)
కడప జిల్లాలో ఒకేరోజు రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఖాజీపేటలో ఒక విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలవ్వగా, రాజూపాలెం మండలంలో పాత కక్షలు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ రెండు ఘటనలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితికి, యువతలో పెరుగుతున్న హింసా ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.
ఖాజీపేటలో పెళ్లి నిరాకరించిందన్న కారణంతో వెంకటేష్ అనే యువకుడు ఒక విద్యార్థిని ఇంటికి వెళ్లి, గొంతు కోసి చంపడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తీవ్రంగా స్పందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఇలా అకాల మరణం చెందడం తనను కలచివేసిందన్నారు. మహిళల జోలికొచ్చే సైకోల పట్ల ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఆడబిడ్డల వైపు కన్నెత్తు చూడాలన్నా భయపడేలా చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తూనే, మగబిడ్డల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని హితవు పలికారు.
ఇక రాజూపాలెం మండలం పర్లపాడులో పాత కక్షలరే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బండి మహేష్ బాబు (25) అనే యువకుడిని చరణ్ అనే వ్యక్తి పాతకక్షల కారణంగా దారుణంగా హత్య చేశాడు. రాజూపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐ ప్రణయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం చేశారు.
కడప జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 10) జరిగిన ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే యువతలో హింసా ప్రవృత్తి కట్టుతప్పుదోందనిపించకమానదు. ఖాజీపేట ఘటనలో ప్రేమ ముసుగులో ఉన్మాదం కనిపిస్తే, రాజూపాలెం ఘటనలో కక్షతో ఓ యువకుడురెచ్చిపోవడం కనిపిస్తుంది. ప్రాణాలను తీశాయి. ప్రేమ వైఫల్యాలను స్వీకరించలేకపోవడం, చిన్న గొడవలను కూడా హత్యల వరకు తీసుకెళ్లడం సమాజంలోని నైతిక విలువల పతనానికి నిదర్శనం. ముఖ్యంగా మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో యువత తప్పుదోవ పడుతున్నారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని మేధావులు సూచిస్తున్నారు. యువతలో బాధ్యతాయుత ప్రవర్తన, చట్టం పట్ల భయం పెరిగినప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందంటున్నారు. ఈ రెండు ఘటనల్లోని నిందితులపై పోలీసులు కఠినంగా వ్యవహరించి, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


