కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోనియా గాంధీ విధేయుడు!!

 

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. రాహుల్ గాంధీ మనసు మార్చేందుకు ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కొత్త అధ్యక్షుడిని నియమించక తప్పదని హైకమాండ్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శనివారం కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని నియమించనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ సీనియర్ నేతలు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నివాసంలో సమావేశమయ్యారు. మరోవైపు, సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరుపొందిన ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ కొత్త చీఫ్ అని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మొదట కాంగ్రెస్ చీఫ్ పదవికి ఏకే ఆంటోనీ పేరు బలంగా వినిపించింది. అయితే ఆయన అధిష్ఠానం ప్రతిపాదనను తిరస్కరించడంతో.. ఆ తర్వాత రాహుల్ గాంధీ సన్నిహితుడు సీకే వేణుగోపాల్ పేరు తెరమీదకు వచ్చింది. అయితే ఆయన కూడా విముఖత వ్యక్తం చేశారు. చివరికి ప్రియాంక గాంధీని కూడా బరిలోకి లాగే ప్రయత్నం చేసినా ఆమె కూడా నో చెప్పారు. దాంతో, మరాఠా యోధుడు ముకుల్ వాస్నిక్ వైపు పార్టీ పెద్దలు మొగ్గుచూపారు. ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టేందుకు వాస్నిక్ కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. గతంలో రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన వాస్నిక్ కు.. పార్టీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. పైగా సోనియాకు అత్యంత విధేయుడిగా పేరుంది. ఏదేమైనా, కాంగ్రెస్ చీఫ్ ఎవరన్న ఉత్కంఠకు రేపటితో తెరపడే అవకాశాలున్నాయి.