ముద్రగడకు పెరుగుతున్న మద్ధతు.. చిరంజీవి, దాసరి కూడా

 

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నేపథ్యంలో ఈరోజు ముద్రగడ పలు కీలక నేతలతో భేటీ అయ్యారు. నిన్న రాత్రికే హైదరాబాదు చేరుకున్న ముద్రగడ... నేటి ఉదయం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ప్రముఖ నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవిలను కలిసిన ముద్రగడ... కొద్దిసేపటి క్రితం దర్శకరత్న దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు.

 

భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి... ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని దాసరి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కాపుల ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

మరోవైపు చిరంజీవి కూడా తమ మద్దతు ముద్రగడ పద్మనాభంకు ఉంటుందని తెలిపారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించిన ముద్రగడ వెనుక తాము నిలబడతామని అన్నారు. కాపులకు రిజర్వేషన్ పై ముద్రగడ చేస్తున్న ఉద్యమం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణను ముద్రగడ తనకు వివరించారని, ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఆయన సాధించాలనుకున్నది సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.