ఇంతకీ ముద్రగడ ఆశిస్తున్నదేమిటి?
Published on: Fri Feb 5, 2016 8:50AM

తమ వర్గాన్ని బీసీలలో చేర్చి వాళ్లకి రిజర్వేషన్ కల్పించాలంటూ ముద్రగడ తునిలో చేసిన రైల్ రోకో హింసాత్మకంగా మారింది. అసాంఘిక శక్తుల వల్లే ఆ రోజు ఉద్రిక్రత చెలరేగిందంటూ ముద్రగడ చేతులెత్తేశారు. తుని సంఘటనల తరువాత ప్రభుత్వం తనంతట తానుగా దిగివచ్చి ఉద్యమనేతలకు కావల్సినన్ని హామీలను ఇచ్చింది. వారి సంక్షేమం కోసం 1000 కోట్లను కేటాయించాలని నిర్ణయించింది. ఉద్యమనేతలు కోరినట్లుగా వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన నివేదికల కోసం చర్యలు తీసుకుంది. ఒకవైపు ప్రభుత్వం ఇలా సానుకూలంగా స్పందిస్తూ ఉంటే మరో వైపు ముద్రగడ ఉద్యమం మీద మరింత పట్టుని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేటి నుంచి కిర్లంపూడిలోని తన స్వగృహంలో ముద్రగడ ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. సాధారణంగా ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకువెళ్లేందుకు ఆమరణ దీక్షను చేపడతారు.
మరి ప్రభుత్వం సానుకూలంగా ఉన్న సమయంలో కూడా ముద్రగడ ఆమరణ దీక్షను చేపట్టడంలోని ఆంత్యం ఏమిటో సాటి నేతలకు సైతం బోధపడటం లేదు. స్వయంగా ప్రభుత్వ మంత్రులే ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినా దీక్షను విరమింపచేయడంలో విఫలమయ్యారు. ఉద్యమాన్ని నిలువరించేందుకు తాము స్పష్టమైన హామీలను ఇచ్చిన తరువాత కూడా ముద్రగడ దీక్షను ఎందుకు సాగిస్తున్నారో ప్రభుత్వానికి సైతం బోధపడటం లేదు. తునిలో హింస జరిగితే కారణం అసాంఘిక శక్తులే అన్న ముద్రగడ తన దీక్ష సమయంలో ఏదన్నా అనుకోని ఘటన జరిగితే దానిని కూడా ఇలాంటి జవాబే చెబుతారేమో! ఇంతకీ ముద్రగడ ఆశిస్తున్నదేమిటి? హామీలను నెరవేర్చేవరకూ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నారా! లేకపోతే ఉద్యమ నేతగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నారా!


