TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐపీఎల్‌లో ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ... మహీ శకం ముగిసినట్లేనా?

Published on: Thu May 7, 2026 7:37PM

 

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడనుందా? మే 18న జరగబోయే మ్యాచ్‌తో ధోనీ వీడ్కోలు పలకబోతున్నారా? అంటే ప్రస్తుతం అవుననే సంకేతాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న తరుణంలో ధోనీ రిటైర్మెంట్ అంశం మరోసారి క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుత సీజన్‌లో మే 18వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి హోమ్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. సొంత మైదానమైన చేపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ అనంతరం ధోనీ తన అధికారిక విరమణ ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 2021లో ధోనీ స్వయంగా మాట్లాడుతూ, తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను చెన్నై అభిమానుల సమక్షంలో ఆడి రిటైర్ అవ్వాలని ఆకాంక్షించారు. ఆ మాటలను గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్, ఈ మే 18నే ఆ ముహూర్తం అని భావిస్తున్నారు.

వాస్తవానికి ఈ సీజన్ ధోనీకి అంత కలిసిరాలేదు. పిక్క కండరాల గాయం కారణంగా ఆయన ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత కొన్ని వారాలుగా ఆయన మైదానానికి దూరంగా ఉండి చికిత్స పొందుతున్నారు. ధోనీ గైర్హాజరీలో సంజూ శామ్సన్ వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జట్టు పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉన్న సమయంలో ధోనీ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి అవసరం ఎంతో ఉందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 44 ఏళ్ల వయసులో కూడా ఆయనపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అరంగేట్రం చేసినప్పటి నుండి తనదైన శైలిలో ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ధోనీ, కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడి బ్యాట్‌తో మెరుపులు మెరిపించాలని కోట్లాది మంది ఆశిస్తున్నారు.

గతంలో టెస్ట్ క్రికెట్‌కు గానీ, అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గానీ ధోనీ వీడ్కోలు పలికిన తీరు చాలా ఆకస్మికంగా ఉంది. ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన నిర్ణయాన్ని ప్రకటించడం ఆయన శైలి. ఈ నేపథ్యంలోనే మే 18న సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత మైక్ పట్టుకుని తన మనసులో మాట చెబుతారని అంతా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతానికి చెన్నై యాజమాన్యం నుండి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తన సొంత గడ్డపై, అభిమానుల కేరింతల మధ్య కెరీర్‌ను ముగించాలన్న ధోనీ చిరకాల కోరిక ఈ నెల 18న నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఒకవేళ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, అది ఐపీఎల్ చరిత్రలోనే ఒక శకం ముగిసినట్లు అవుతుందనడంలో సందేహం లేదు.