తెలంగాణ ఎంపీలను నాలుగు రోజులు సస్పె౦డ్ చేసిన స్పీకర్
Published on: Tue Apr 24, 2012 4:39PM
తెలంగాణ ప్రాంత ఎంపీలను లోకసభ స్పీకర్ మంగళవారం నాలుగు రోజులు పాటు సస్పె౦డ్ చేశారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ, మంద జగన్నాథం, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయక్, రాజయ్యలపై సస్పెన్షన్ వేటు వేశారు.ఎంపీలు సభలో తెలంగాణ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో స్పీకర్ పలుమార్లు వారికి సభను అడ్డుకోవద్దని సూచించారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. జై తెలంగాణ, తెలంగాణను వెంటనే తేల్చాలంటూ వారు సభలోనే బైఠాయించారు.దీంతో స్పీకర్ వారిపై నాలుగు రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు.కాగా స్పీకర్ సస్పెండ్ చేసినప్పటికీ ఎంపీలు సభ నుండి బయటకు రాలేదు. సభలోనే తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. కాగా తెలంగాణ ఎంపీలపై సస్పెన్షన్ వేటును పలువురు తెలంగాణ వాదులు, తెలంగాణవాద పార్టీలు ఖండించాయి.


