రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న రేవంత్ ! 

టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. అబద్దాలు చెప్పడంలో కేటీఆర్... ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిపోయారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ పచ్చి అబద్దాలతో బ్రతికేస్తున్నారని, అబద్దాలు చెప్పడమే సీఎం పదవికి అర్హత అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.  కేటీఆర్ గుంటకాడి నక్కలా సీఎం పదవి కోసం ఎదురు చూడాల్సిందేనని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ కేటీఆర్‌ను సీఎం చేయరని అన్నారు. మంత్రి పదవి పోతుందని భయపడేవారు, కొత్తగా మంత్రి కోరుకుంటున్న వారే కేటీఆర్ సీఎం అని అంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 

మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్ రెడ్డి..  కొడంగల్‌ అభివృద్ధిపై అధికార పార్టీకి సవాల్ చేశారు. కొడంగల్ ను అభివృద్ధి చేసినట్లు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గతంలో తాను చేసిన అభివృద్ధికి రంగులు మార్చి వారి ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. 2019 తర్వాత కొడంగల్‌కు ఒక్క అభివృద్ధి పనిని మంజూరు చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌కు దమ్ముంటే పనులు మంజూరు చేసినట్టు పోలేపల్లి ఎల్లమ్మ మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు రేవంత్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొత్త పార్టీపై స్పందించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణను అందరూ ప్రయోగశాల చేస్తున్నారని చెప్పారు.