చెయ్యికి చెయ్యి, కాలికి కాలు విరగ్గొడతారు.. కొడాలి నానికి రఘురామరాజు సీరియస్ వార్నింగ్

ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో స్పందించారు. విగ్రహాలు విరిగిపోతే ఏంటని మంత్రి కొడాలి అనడం నిజంగా సిగ్గుచేటని అయన అన్నారు. అసలు కొడాలి వెనుక ఉన్న ఆ శక్తి ఎవరో... అందరికీ తెలుసని.. దీనిపై పెద్దగా బుర్రలు బద్ధలు కొట్టుకోవాల్సిన అవసరం లేదని తాను ఆ శక్తికి చేతులు ఎత్తి మొక్కుతున్నానని రఘురామరాజు వ్యాఖ్యానించారు. ‘‘కొడాలి వేంకటేశ్వర రావు (నాని) అలాగే అయన వెనుక ఉన్న అదృశ్య శక్తికి స్పష్టంగా చెబుతున్నా... రాబోయే రోజుల్లో చెయ్యి విరగ్గొడితే చెయ్యి.. కాలు విరగ్గొడితే కాలు విరగ్గొడతారు ఖబడ్దార్’’ అని మండి పడ్డారు .

 

ఢిల్లీలో ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఎంపీ రఘురామరాజు ‘‘అయ్యా.. కొడాలి వేంకటేశ్వరరావు.. ఎదో విరిగిపోతే దేవుడికి ఏంటి నష్టమని అడుగుతున్నారు. అయ్యా దేవుడి పరమ భక్తుడైన కొడాలి నాని గారు నష్టం దేవుడికి కాదు. మాకు నష్టం. మన హిందువులకు నష్టం.. మొత్తం మన హిందువుల మనసులను గాయపరుస్తున్నారు. అక్కడ తగలబెట్టింది రథాలను కాదు.. భక్తుల మనోరథాలను, విరగొట్టింది విగ్రహాలను కాదు.. భక్తుల మనోభావాలను గాయపరిచారు. మతోన్మాదంతో మీరు చేస్తున్న ఈ గాయాలకు తగిన శిక్ష అనుభవించే రోజు వస్తుంది. నన్ను బహిష్కరించానని చెప్పుకొనే శక్తి లేని నిస్సహాయ స్థితిలో మీరున్నారు. దేవాలయాలపై పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే మీ సాటి కులస్థుడితో.. మీ సాటి మతస్తుడితో అల్లరి చేయిస్తారా? ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలారా.. కులాన్ని కులంతో.. మతాన్ని మతంతో... అదే మతంలో అతి పవిత్రంగా తిరుమల ఆచారాలను పాటించే కేబినెట్ సహచరుడితో ఇలా నాపై విమర్శలు చేయించడం అత్యంత హేయమైన చర్య. మీరు ప్రవేశపెట్టిన నాన్న బుడ్డి పథకాలకోసం... మీకు రివర్స్ వచ్చే పథకాలు చాలక... ఎక్కడా అప్పు పుట్టక మీ బంధువు ద్వారా స్వామి డబ్బుపై దృష్టి పెట్టారని ప్రజలు అనుకుంటున్నారు. టీటీడీలో ఇద్దరు ఉన్నతాధికారులను మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందన్న అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి.’’అని ప్రభుత్వాధినేతల పై దుమ్మెత్తిపోశారు.

 

హిందువైన కొడాలి నాని కానీ, క్రిస్టియన్ అయిన సీఎం జగన్ కానీ... ఎవరూ కూడా మక్కాలో అడుగుపెట్టలేరు. ఎందుకంటే అది ముస్లింలకు పవిత్ర స్థలం. మసీదుల గురించి నానిమాట్లాడటం విచారకరం. మీ ఏరియాలో మీరు హీరోనే.. మీరు మాట్లాడితే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. దేవాలయాలపై దాడులు జరిగితే ఎవరికి నష్టం అని మీరు అంటున్నారు. మీ జేబుల్లోంచి డబ్బులు ఇవ్వడం లేదు కదా. నష్టం మాకు. రథం చేయంచుకుంటే ఎవరికి లాభం.. మీకు ఉండొచ్చు. అంతేకాకుండా వెండి పోతే కొనుక్కుంటారని మీరు చెబుతున్నారు. పోయింది కేవలం వెండి కాదండి... అది అమ్మవారి వెండి. మీరు విగ్రహాన్ని రాయిగా చూస్తున్నారు. మా దృష్టిలో దేవుడు. అక్కడ పోయిన సొమ్ము అమ్మవారికి చెందినది. మీరు ఒక హిందూ అయ్యి ఉండి.. ఓ క్రిస్టియన్ సీఎం చేతిలో ఉండి ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఎన్నికల్లో గెలవాలంటే హిందూ మతం కావాలి. ఇంట్లో ఓ హిందూ దేవుడి ఫొటో ఉండదు. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఎవరెవరు చర్చిలకు వెళుతున్నారో రాష్ట్రపతికి రిపోర్టు ఇచ్చాను. త్వరలో వివరాలు అందరికి తెలుస్తాయి. హిందువులు అంటే శాంతస్వభావులు. పెద్దగా తిరగబడరు. మా స్వభావం అలాగే ఉంటుంది. మీ వెనుక ఉన్న ఆ అదృశ్యశక్తికి చెబుతున్నా.. మా మతం జోలికి రాకండి. భరతమాత ముద్దుబిడ్డ ఇక్కడే మా వెనక ఉన్నారు. మీరు గౌరవించకపోయినా ఫర్వాలేదు. కానీ అవమానించకండి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పెద్దలు మాడభూషి శ్రీధర్ ఇప్పటికే ఓ లేఖ రాశారు. అది చదివితే అన్నీ తెలుస్తాయి. ఇక దేవుడి సొమ్మును కొట్టేసినోడు బాగుపడినట్టు ఈ ప్రపంచంలో లేదు. మేము మీ దేవుణ్ణి గౌరవిస్తాం. మీరు మా దేవుణ్ణి గౌరవించండి’’ అని వ్యాఖ్యానించారు.