పవన్ పై జేసీ కొడుకు... ఆయనకు రుణపడి వుంటా..
posted on Dec 4, 2017 12:08PM
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల తన కొడుకు రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే కదా. తన కొడుకు జేసీ పవన్ కుమార్ రెడ్డికి..పార్లమెంట్ కు వెళ్లాలన్న ఆసక్తి ఉందని.. " చంద్రబాబు కనికరిస్తే, మా వాడే కింగ్... వాడికి పార్లమెంట్ కు పోటీచేయాలని ఉందని మొన్నీ మధ్య చెప్పాడు కదా. ఇప్పుడు పవన్ కుమార్ కూడా స్వయంగా తానే ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న పవన్ కుమార్... తనకు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ పడాలన్న ఆలోచన లేదని, పార్లమెంట్ కు పోటీ చేసి గెలిస్తేనే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయవచ్చన్నది.. తన అభిమతమని చెప్పాడు. తాను రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేని వ్యక్తినని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని, తన తండ్రి అన్నా ఆయనకు అభిమానం ఉందని, ఆయనకు ఎప్పటికీ రుణపడి వుంటామని అన్నారు. జనసేన స్వతంత్రంగా పోటీ చేస్తుందా? లేక మరేదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో కూడా తెలియదని, పొత్తు పెట్టుకుంటే, ఈ ప్రాంతంలోని సీట్లు జనసేనకు వెళతాయని భావిస్తున్నానని అన్నారు. అందుకే అసెంబ్లీ సెగ్మెంట్ పై కాకుండా, పార్లమెంట్ సెగ్మెంట్ పైనే దృష్టిని పెట్టానని అన్నారు.