వైసీపీ గూటికి ఎంపీ బుట్టా రేణుక!!

 

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరతారని వార్తలొస్తున్నాయి. ఆమె గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున కర్నూలు ఎంపీ టికెట్ ఆశించారు. కొద్దిరోజులు క్రితం వరకు కూడా సిట్టింగ్ ఎంపీగా ఆమెకే మళ్ళీ టికెట్ వస్తుందని భావించారంతా. కానీ తరువాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరారు. దీంతో బుట్టా రేణుక ఎంపీ స్థానానికి గండి పడినట్లయింది. దీంతో పలు పార్టీలు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. బీజేపీ, జనసేన నేతలు ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తూ.. ఆమెతో సంప్రదింపులు జరపగా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ఆమెకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చింది. రాజ్యసభకే మొగ్గు చూపుతున్న ఆమె.. ఇప్పుడే అధికారికంగా ప్రకటించాలని కోరుతున్నారు. కానీ టీడీపీ నుంచి స్పందన రాలేదు. దీంతో తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో జగన్‌తో భేటీ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం.