ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం.. కమ్మ కులంలో చెడపుట్టారు..

 

టీటీడీపీ నేత మోత్కుపల్లి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడిపై విమర్సలు కురిపించారు.తనను గవర్నర్ చేస్తానని, రాజ్యసభకు పంపిస్తానని చెప్పిన చంద్రబాబు... ఆ తర్వాత మోసం చేశారని అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని... ఇప్పుడు కనీసం మహానాడు కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదని వాపోయారు. ఎన్టీఆర్ పార్టీకి తనను దూరం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయన... కన్నీటిపర్యంతం అయ్యారు.

 

ఎన్టీఆర్ ఆశీర్వాదం వల్లే తాను రాజకీయాల్లో ఉన్నానని...తన రాజకీయ జీవితాన్ని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పాలించే అర్హత కూడా లేదని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జయంతికి కాని, వర్ధంతికి కాని ఘాట్ వద్దకు వచ్చి చంద్రబాబు ఎప్పుడైనా నివాళి అర్పించారా? అని ప్రశ్నించారు. అంతేకాదు... టీడీపీ బాగుండాలంటే ఎన్టీఆర్ వారసులకు పార్టీని అప్పగించాలని...ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్రలు చేశారని.. టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా కూర్చొని మాట్లాడాలని... తామంతా ఏపీకి వచ్చి ప్రచారం చేస్తామని చెప్పారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం.