ఆస్తికోసం కన్న కూతుర్ని చంపేసిన తల్లి

 

హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడాలో దారుణం జరిగింది. కన్నతల్లే కూతుర్చి నడి రోడ్డు మీద హత్య చేసింది. యూసుఫ్‌గూడాలోని లక్ష్మీ నరసింహ నగర్‌లో నివసించే లక్ష్మి (50) తన కుమార్తె కళ్యాణి (25)ని కత్తితో నడిరోడ్డు మీద నరికి చంపింది. కూతుర్ని చంపిన తర్వాత చేతిలో రక్తమోడుతున్న కత్తితో కూతురి శవం పక్కనే భయంకరంగా నిల్చుని వున్న లక్ష్మిని చూసి స్థానికులు బెదిరిపోయారు. లక్ష్మి తన ముగ్గురు కూతుళ్ళతో కలసి లక్ష్మీ నరసింహ నగర్‌లో నివసిస్తోంది. వీళ్ళమధ్య కొంతకాలంగా నెలకొన్న ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. ఈ హత్య చేయడానికి మిగతా ఇద్దరు కూతుళ్ళు కూడా తల్లికి సహకరించారని సమాచారం. లక్ష్మి తన కన్న కూతుర్ని హత్య చేయడానికి ముందు తన ఇంటి చుట్టూ వున్న క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను ధ్వంసం  చేసింది. బంజారాహిల్స్‌ పోలీసులు లక్ష్మితోపాటు ఇద్దరు కూతుళ్ళను అదుపులోకి తీసుకున్నారు.