TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, నిఫా వైరస్‌లు.. కేరళలో హై అలర్ట్

Published on: Fri Sep 20, 2024 12:26PM

నిఫా, మంకీ పాక్స్ వైరస్ లు వణికిస్తున్నాయి. దేశంలో ఈ రెండు వైరస్ లు బయటపడ్డాయి. కేరళకు చెందిన ఒక వ్యక్తికి రెండు వైరస్ లూ సోకాయి. మంకీపాక్స్ తో కేరళ ఇప్పటికే వణికిపోతున్నది. ఇప్పుడు తాజాగా నిఫా వైరస్ కూడా రాష్ట్రంలో వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఒకే వ్యక్తికి ఈ రెండు వైరస్ లూ సోకడంతో కేరళ సర్కార్ అలర్ట్ అయ్యింది.  మంకీ పాక్స్‌.. నిఫా వైరస్‌ వ్యాప్తితో కేరళలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడును కూడా అధికారులు అలర్ట్ చేశారు.   

ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ వైరస్‌ సోకినట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఆయన మంకీపాక్స్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపింది. మంజేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని శాంపిల్స్‌ను కోజికోడ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. పాజిటివ్‌గా తేలింది. దాంతో.. దేశంలో రెండో మంకీపాక్స్‌ కేసు రికార్డ్‌ అయింది. అలెర్ట్‌ అయిన కేరళ అధికారులు.. దుబాయ్‌ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరెవర్ని కలిశారో వారిని ట్రేస్‌ చేసే పనిలో పడ్డారు. 16మందిని గుర్తించి ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. ఈనెల 9న తొలి మంకీపాక్స్‌ కేసు నమోదు అయింది.

ఒకవైపు కేరళను మంకీపాక్స్‌ వణికిస్తుండగా.. ఇప్పుడు నిఫా వైరస్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా.. ఒక వ్యక్తికి నిఫా వైరస్ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. అతనితో కలిసి ఉన్న 268 మందిని ఐసొలేషన్‌లో ఉంచారు కేరళ అధికారులు. వారిలో 81 మంది హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌, 177మంది ప్రైమరీ కాంటాక్ట్‌ ప్రజలు, 90మంది సెకండరీ కాంటాక్ట్‌ ప్రజలుగా గుర్తించారు. వీరిలో కొందరిని   హైరిస్క్‌ కేటగిరిలో ఉంచారు.  

ఇదిలావుంటే.. కేరళలోని మలప్పురంలో నిఫా వైరస్‌తోపాటు.. మంకీ పాక్స్‌ లక్షణాలున్న వ్యక్తులను గుర్తించారు. దీంతో తమిళనాడు- కేరళ సరిహద్దు జిల్లాల్లో అలెర్ట్ ప్రకటించారు. కేరళ నుంచి కన్యాకుమారి ద్వారా తమిళనాడుకు వస్తున్న వాహనాలపై నిఘా పెంచారు. పూర్తి వైద్య పరీక్షల తర్వాతే కేరళ నుంచి తమిళనాడులోనికి ప్రజల్ని అనుమతిస్తున్నారు.