అంతరాత్మను బయట పెడతానంటున్న కలెక్షన్ కింగ్

 

 

 

కొంతకాలంగా అంతరాత్మను చంపుకుని ఓపిగ్గా ఉన్నానని, కొన్ని రోజుల తరువాత తన అంతరాత్మను బయటపెడతానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటున్నారు. త్వరలో ఓ వ్యక్తిపై సంచలన వ్యాఖ్యలు చేస్తానని, వారి అక్రమ సంపాదననూ బయట పెడతానని ఆయన చెప్పారు. ఆ వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు ఎంత ఆస్తి ఉండేది? ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎంత ఆస్తి సంపాదించాడని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆయనీ వ్యాఖ్యలు చేయడంతో.. అవి ఎవరి గురించన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో సహజంగానే నెలకొంది.

 

ఓటర్లు  నిజాయితీగా, డబ్బులకు లొంగకుండా ఓటు వేసినరోజు దేశం ముందడుగు వేస్తుందని కూడా మోహన్ బాబు అన్నారు. ఎన్నికల్లో డబ్బుతీసుకుని ఓటేస్తే మన హక్కులకోసం నాయకుడిని నిలదీసేందుకు అర్హత కోల్పోతామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతిని రూపుమాపితే తప్ప ప్రజలకు మంచి జరగదన్నారు.



గతంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన మోహన్ బాబు, ఆ తర్వాత మాత్రం వాటికి కొంత దూరంగా ఉన్నారు. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోందని ఈ వ్యాఖ్యలు విన్నవాళ్లు అంటున్నారు.