TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రధాని మోదిని కలసిన చిన్నారి ఫ్రెండ్స్ ఎవరో తెలుసా?

Published on: Mon May 25, 2026 9:08AM

ఎప్పుడూ పాలనాపరమైన అంశాలతో నిండి ఉండే   ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఆదివారం రోజున ఇద్దరు చిన్నారులతో ఉన్న చిత్రాలు ప్రత్యక్షం అవ్వడం.. ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. ఆ ఇద్దరు చిన్నారుల చిత్రాల దిగువ ప్రధాని మోది.. నిన్నటి రోజున నా ఇద్దరు చిన్నారి మిత్రులు నన్ను కలవడానికి సేవా తీర్ద్ కు వచ్చారు అని చెప్పుకురావడంతో.. ఎవరా చిన్నారులు అని అంతా ఆరా తియ్యడం మొదలు పెట్టారు. 

కట్ చేస్తే   ఆదివారం (మే 24) రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా సేవా తీర్ద్ లో కలిశారు. సుమారు ఇరవై నిమిషాల పాటు ఈ ఆత్మీయ భేటి కొనసాగింది. ఈ భేటీలో  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తల్లి  విజయమ్మ.. ఓ మొక్కను మోదీకి బహూకరిస్తూ,  ఎక్ పేడ్ మా కే నామ్ నినాదాన్ని గుర్తు చేశారు.  అనంతరం ప్రధాని మోది సైతం రామ్మోహన్ నాయుడు పనితీరును మెచ్చుకుంటూ,  మీ కుమారుడు చిన్న వయస్సులోనే గొప్పగా పనిచేస్తున్నారంటూ కితాబిచ్చారు.  ఇక  ఆదివారం( మే 24)    ప్రధాని మోదీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వచ్చిన చిత్రాలు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమార్తె మిహిరా అన్వి శివాంకృతి,  కుమారుడు శివాన్ ఎర్రంనాయుడులవి.. 

 ప్రధాని మోదీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తన పిల్లల ఫోటోలు రావడం పట్ల రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేస్తూ అక్కడ జరిగిన సంభాషణలను పంచుకున్నారు. సుమారు ఇరవై నిమిషాల పాటు జరిగిన భేటి లో తన పిల్లలతోనే అయన ఎక్కువ సేపు గడిపారనీ, తన కుమార్తె ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ తీసుకుందనీ చెప్పారు. ఆ ఆటోగ్రాఫ్ తో పాటు ఆమెకు కొన్ని చాక్లెట్లు కూడా ఇచ్చారనీ పేర్కొన్నారు.   తన కుమారుడిని అయన టేబుల్ పై కూర్చోబెట్టుకుని.. పేరేంటి అని అడుగుతూ, ఆటలాడుతూ  ఆనందంగా గడిపారని అన్నారు.  ప్రపంచం మెచ్చిన నాయకుడు.. తన పిల్లలతో సరదా సమయం గడిపి సేదతీరుతూ ఉంటె ఆనందంగా అనిపించిందని.. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.