మోడీ వరంగల్ పర్యటన ఖరారు.. 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా
Published on: Thu Jun 29, 2023 5:08PM
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. వచ్చే నెల 8న ప్రధాని మోడీ వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖాజీపేటలో వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు.
అదే విధంగా వరంగల్ నగరంలో టెక్స్ టైల్ పార్కుకు కూడా మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత వరంగల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందు కోసం బీజేపీ తెలంగాణ నాయకత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో జనాలను సమీకరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇలా ఉండగా ప్రధాని మోడీ పర్యటన కారణంగా అదే రోజు అంటే జూలై 8న హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అధ్యక్షతన జరగాల్సి ఉన్న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశం ఎప్పుడు జరిగేదీ తరువాత ప్రకటిస్తామని బీజేపీ పేర్కొంది.


