పాక్ పార్లమెంట్ లో మోడీ నినాదాలు! అసహనంతో ఉడికిపోయిన మంత్రులు 

పాకిస్తాన్ పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదాలు. ఏంటీ తప్పుగా రాశారని అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్టే. మీరు చదివింది అక్షరాల నిజమే. మన దాయాది పాకిస్తాన్ పార్లమెంట్ లోనే ప్రధాని మోడీ పేరు మార్మోగింది. దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా మంత్రులు అసహనానికి గురయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక కొందరు మంత్రులు పార్లమెంట్ నుంచి బయటికి వెళ్లిపోయారు. 
          

పాకిస్థాన్ పార్లమెంటులో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. బలూచిస్థాన్ ఉద్యమం గురించి పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ సభలో ప్రసంగిస్తుండగా, బలూచిస్థాన్ ఎంపీలు అడ్డుతగిలారు. వారు సభాముఖంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని వేనోళ్ల పొగుడుతూ పాక్ విదేశాంగ మంత్రిని తీవ్ర అసహనానికి గురిచేశారు. ఆ ఎంపీలు ఎంతకీ తగ్గకుండా మోడీ, మోడీ అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో ఖురేషీ ఉడికిపోయారు.

 

బలూచిస్థాన్ ఎంపీల మనసుల్లోకి మోడీ భావనలు చొరబడినట్టున్నాయని, భారత అజెండాను విపక్ష సభ్యులు పాక్ లో అమ్ముతున్నారని ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత అనుకూల నినాదాలతో జాతీయ సంస్థలను అవమానానికి గురిచేస్తున్నారని విమర్శించారు. విపక్ష సభ్యుల నియోజకవర్గాల నుంచి బలూచిస్థాన్ స్వాతంత్రం కోసం నినాదాలు రావడం సిగ్గుచేటన్నారు పాక్ విదేశాంగ శాఖ మంత్రి. అయినా బలూచిస్థాన్ ఎంపీలు ఖురేషీకి పదేపదే అడ్డుతగిలారు. దాంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు.

 

అంతకుముందు  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వైఖరిని ఖండిస్తూ ఆయనకు వ్యతిరేకంగా పాకిస్థాన్ పార్లమెంటు తీర్మానం ఆమోదించింది. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా చార్లీ హెబ్డో పత్రికలో వ్యంగ్య చిత్రణ చోటుచేసుకోవడాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఖండించకపోవడాన్ని నిరసిస్తూ పాక్ పార్లమెంటులో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ప్రసంగిస్తూ, మధ్యలో బలూచిస్థాన్ ప్రస్తావన తీసుకువచ్చారు. దాంతో బలూచిస్థాన్ ప్రాంత ఎంపీలు రెచ్చిపోయి మంత్రి ప్రసంగాన్ని రసాభాస చేశారు. భారత ప్రధాని మోడీకి జై కొడుతూ నినాదాలు చేశారు.