TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ ప్రభుత్వం చంద్రబాబుకే అండగా నిలబడిందా?

Published on: Tue Jun 23, 2015 3:19PM

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి సెక్షన్: 8ని అమలుచేయాలని చేసిన విజ్ఞప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం మొదట సానుకూలంగా స్పందించకపోవడంతో తెరాస, కాంగ్రెస్, వైకాపాలు చాలా సంబరపడ్డాయి. అదేవిధంగా ఓటుకినోటు కేసులో కూడా కేంద్రం కలుగజేసుకోకుండా ఊరుకోవడంతో ఇక ‘చంద్రబాబు నాయుడుని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని’ ఆ మూడు పార్టీలు తీర్మానించేసాయి. కానీ ముందు చాలా దూకుడుగా వ్యవహరించిన ఎసిబి అధికారులు గత వారం రోజులుగా చల్లబడిపోవడం గమనిస్తే వారు మరింత ముందుకు వెళ్ళకుండా కేంద్రప్రభుత్వమే తెలంగాణా ప్రభుత్వానికి బ్రేకులు వేసినట్లు అర్ధమవుతోంది. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెక్షన్: 8ని అమలుచేయడానికి సిద్దపడుతోందన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి పరోక్షంగా సహాయపడుతూనే ఆయన మాటకి కూడా చాలా విలువ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. లేకుంటే సెక్షన్: 8ని తెలంగాణా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందనే విషయం తెలిసిన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం దానిని అమలుచేయాలని ప్రయత్నించేది కాదు. కానీ దానిని అమలుచేయాలని ప్రయత్నిస్తే తెరాస ప్రభుత్వం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. అంతేకాక ఊహించని అనేక కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మరి వాటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడాలి.