మోడీ గో బ్యాక్.. స్టాప్..! మోడీ నో ఎంట్రీ..!
posted on Feb 9, 2019 1:48PM
ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ ఏపీలో అడుగు పెట్టవద్దని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. మోడీ పర్యటనను ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. విజయవాడ లెనిన్ కూడలిలో వామపక్ష నేతలు నిరసనకు దిగారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ రాష్ట్ర పర్యటనకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.
మోడీ పర్యటనను అడ్డుకుని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. మోడీ పర్యటనను నిరసిస్తూ కడప జిల్లాలో మట్టి, నీళ్ల కుండలతో వామపక్షాలు వినూత్నంగా నిరసన తెలిపాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్? అంటూ మోడీ తలదించుకుని ఉన్న ఓ ఫొటో పెట్టి... ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీ పర్యటనపై శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.