చంద్రబాబుని పొగిడి మరీ వైసీపీలోకి.. ఇదేం లెక్క మాగుంట!!

 

టీడీపీకి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. అనుచరులతో సమావేశం అనంతరం వైసీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. తన అభిమానుల కోరిక మేరకు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైసీపీలో చేరుతున్నానని మాగుంట చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో తాను ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

2014లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ బలహీన పడటంతో చంద్రబాబు సూచన మేరకు టీడీపీలో చేరానన్నారు. చంద్రబాబుతో తమ కుటుంబానికి ఉన్న సంబంధాల దృష్ట్యా గత ఐదేళ్లలో అన్నివిధాలా ఆయన గౌరవించారని తెలిపారు. ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని చంద్రబాబును కొనియాడారు. అయితే.. టీడీపీని వీడిన నేతలు చంద్రబాబుపై విమర్శలు చేసి మరీ వెళుతుంటే మాగుంట మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. చంద్రబాబు తనకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి మాగుంట ప్రశంసించడంతో వైసీపీకి ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.