రోజాకి తప్పిన ప్రమాదం...

 

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ప్రమాదం తృటిలో తప్పింది. రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం ల్యాండవుతున్న సమయంలో టైరు పేలిపోయింది. తిరుపతి నుంచి వస్తుండగ ప్రమాదం జరిగింది. విమానంలో రోజా సహా 70 మంది ఉన్నారు. టైరు పేలిపోవడంతో ఒక్కసారిగా నిప్పు రవ్వలు లేచి విమానానికి అంటుకున్నాయి. రన్‌వే వద్ద ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వాటిని అదుపులోకి తెచ్చారు. విమానం కుదుపులకు గురవడం, మంటలు అంటుకోవడంతో ఏం జరుగుతుందో తెలియక లోపలున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు ఆర్పిన తర్వాత కూడా చాలా సేపటి వరకు విమానం తలుపులు తెరవలేదు. విమానం దగ్గరికి ఎవరినీ వెళ్లనీయలేదు. నిజానికి ఈ విమానం రాత్రి 9:40 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా 10:00 గంటలకు ల్యాండైంది.

 

ఇక ప్రమాదంపై స్పందించిన రోజా మాట్లాడుతూ...తిరుమల వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే ప్రమాదం తప్పిందని... తొలుత మంటలు కనిపించాయని, ఆ తర్వాత కాసేపటికే విమానం రన్‌వేపై ఆగిపోయిందన్నారు. మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో అర్థం కాక అందరం భయపడ్డామని, తానైతే విమానం పేలిపోతుందేమోనని అనుకున్నానని చెప్పారు.