TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొడుకు రిసెప్షన్ రద్దు.. ఆ సొమ్ముతో ఆ ఎమ్మెల్యే ఏం చేశారంటే?

Published on: Thu Sep 18, 2025 3:24PM

ఆ ఎమ్మెల్యే రైతులను యూరియా కష్టాల నుంచి బయటపడేయాలని తపన పడ్డారు. తపనపడి ఊరుకోలేదు..లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికీ ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయడానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ సొమ్ముల కోసం ఆయన ఏకంగా తన కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేశారు. ఆ రిసెప్షన్ కోసం వ్యయం చేద్దామని కేటాయించిన రెండు కోట్ల రూపాయలను రైతుల కోసం ఇచ్చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. తన కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేసుకుని మరీ రెండు కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆయన ఆ మేరకు గురువారం (సెప్టెంబర్ 18) తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రెండుకోట్ల రూపాయల చెక్కు అందించారు. ఆ రెండు కోట్లనూ తన నియోజకవర్గంలోని రైతులకు ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున యూరియా అందజేయాలని ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి సీఎంను కోరారు.  

ఇటీవలే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. ఆ వివాహ రిసెప్షన్ ను మిర్యాల గూడలో భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు బత్తుల లక్ష్మారెడ్డిని కదిలించాయి. అంతే కుటుంబ సభ్యులతో చర్చించి కుమారుడి వివాహ రిసెప్షన్ ను  రద్దు చేసి.. ఆ సొమ్ముతో రైతులకు యూరియా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.