తెలంగాణ కాంగ్రెస్ కు చంద్రబాబు డబ్బులు.. నొక్కేసిన ఉత్తమ్, భట్టి!!

 

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు ఫిరాయించిన ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దళిత ఎమ్మెల్యేలను గౌరవించే సంస్కారం భట్టికి లేదని.. కాంగ్రెస్‌లో ఉత్తమ్, భట్టి ముఖ్యమంత్రుల్లా ఫీల్ అవుతున్నారని చిరుమర్తి విమర్శించారు. ఉత్తమ్, భట్టి ఇద్దరూ తెలంగణ ద్రోహులని.. ఇప్పుడు దీక్షలు చేస్తున్న ఈ నేతలు, నాడు తెలంగాణ కోసం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి డబ్బులు తెచ్చుకుని ఉత్తమ్, భట్టి పంచుకున్నారని చిరుమర్తి ఆరోపించారు.

తాము అమ్ముడు పోయామని రుజువు చేస్తే తక్షణం పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. ఒకవేళ రుజువు చేయలేకపోతే.. ఉత్తమ్, భట్టి తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని చిరుమర్తి సవాల్ విసిరారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపు అంశంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించారు. తనకు కోర్టు నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని చిరుమర్తి స్పష్టం చేశారు.