TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌ వెనుక సీఎం పేషీ హస్తముందా?

Published on: Sat Jun 3, 2017 11:05AM

 

మియాపూర్ ల్యాండ్‌ స్కామ్‌ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుండగానే మరోవైపు నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వేలకోట్ల విలువైన భూముల అక్రమ రిజస్ట్రేషన్లలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ కేసులో మంత్రి తలసాని ప్రమేయం ఉందన్నారు దిగ్విజయ్ సింగ్. దిగ్విజ్‌ ఆరోపణలపై తలసాని సీరియస్‌ అయ్యారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను దిగ్విజయ్ కి లీగల్ నోటీసులు పంపిస్తానని.... 10కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

 

మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌లో సీఎం పేషీ ప్రమేయముందని షబ్బీర్‌ అలీ ఆరోపించారు. ఎంసెట్‌, నయీమ్, ఓటుకు నోటు కేసులను సైడ్‌ ట్రాక్‌ చేసినట్లే.... దీన్ని కూడా పక్కనబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మియాపూర్‌ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ పాలన మూడు స్కామ్‌లు.... ఆరు అవినీతి దందాల్లా సాగుతోందన్నారు. మియాపూర్‌ భూదందాలో 17వేల కోట్ల స్కామ్‌ జరిగిందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న రేవంత్‌... ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీపై చర్యలు తీసుకోవాలన్నారు.

 

మొత్తానికి మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌... కేసీఆర్‌ సర్కార్‌ మెడకు చుట్టుకుంటోంది. ఈ కుంభకోణంలో ఏకంగా సీఎం పేషీపైనే ఆరోపణలు రావడం.... మరోవైపు విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తుండటంతో.... టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.