క్రికెట్ కు మిథాలీ గుడ్ బై
Published on: Wed Jun 8, 2022 4:15PM
మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. 1999 జూన్ లో ఆమె అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మిథాలీ రాజ్ ప్రపంచ మహిళా క్రికెట్ లో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన రికార్డ్ మిథాలీ పేరుమీదే ఉంది. ఇండియా తరపున ఆమె 232 వన్డేలకు ప్రాతినిధ్యం వహించారు.
50.68 యావరేజ్ తో 7,805 పరుగులను సాధించారు. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి మన దేశ గెలుపుకోసం తన వంతు కృషి చేశానని మిథాలి తెలిపారు. తనకు ఎంతో సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.
భారత మహిళా క్రికెట్ కు మిథాలీరాజ్ అందించిన సేవలు మరువలేనివని బీసీసీఐ కార్యదర్శి జైషా పేర్కొన్నారు. మిథాలీ క్రికెట్ కు గుడ్ బై చెబుతూ ప్రకటన చేసిన నిముషాల వ్యవధిలో జైషే వరుస ట్వీట్లతో మిథాలీరాజ్ క్రికెట్ కు చేసిన సేవలను ప్రస్తుతించారు.
23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో మిథాలీరాజ్ అనితర సాధ్యమైన రికార్డులెన్నో సొంతం చేసుకుంది. దేశంలో మహిళా క్రికెట్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది. ఆమె స్ఫూర్తితోనే మహిళలు క్రికెట్ పట్ల మక్కువపెంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. దేశంలో టెన్నిస్ పట్ల ఆదరణ పెరిగేందుకు సానియా మీర్జా ఎలా స్ఫూర్తిగా నిలిచారో.. మహిళల క్రికెట్ కు ఆదరణ పెరిగేందుకు మిథాలీ రాజ్ అలా దోహదపడ్డారు.


