కోర్టు చివాట్లు పెట్టినా మారన తీరు.. కరోనాపై బోగస్ లెక్కలు! 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు ,కేసులు, మరణాల లెక్కలపై  మొదటి నుంచి అనుమానాలున్నాయి. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందనే ఆరోపణలున్నాయి. కరోనా కేసుల్లో తప్పుడు లెక్కలపై గతంలో హైకోర్టులోనూ విచారణ జరిగింది. సరైన నివేదికలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయినా సర్కార్ తీరు మారలేదని, అవే తప్పులు చేస్తున్నారని, కరోనా టెస్టులు, కేసులు, మరణాల విషయంలో బోగస్ లెక్కలే చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా అంశంలో కేంద్రానికి ఇచ్చే లెక్కలు వేరేలా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చె బులిటెన్లలో మరోలా వివరాలు ఉంటున్నాయి. తాజాగా ఆగస్టు  నెలకు సంబంధించి కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖకు రాష్ట్ర వైద్య శాఖ పంపిన నివేదికలో తప్పుడు లెక్కల బండారం బహిర్గతం అయింది .

 

తెలంగాణలో ఆగస్టు నెలలో 8 లక్షల 79 వేల 479 మందికి కరోనా టెస్టులు చేసినట్టు కేంద్రానికి రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర పంపిన వివరాల ఆధారంగా కేంద్ర హెల్త్​ మినిస్టర్​ పార్లమెంట్‌‌‌‌లోనే ఈ వివరాలను వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ  బులెటిన్‌‌‌‌లో మాత్రం.. ఆగస్టులో 9 లక్షల 65 వేల 253 టెస్టులు చేసినట్టు చెప్తోంది. కేంద్రానికి ఇచ్చిన లెక్కకు, బులెటిన్‌‌‌‌లో చెప్పిన లెక్కకు 85 వేల 774 టెస్టుల తేడా ఉంది. అంటే తక్కువ టెస్టులు చేసి ఎక్కువగా చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇలా అసలు లెక్కలు బయటపడతాయనే ఉద్దేశంతోనే జిల్లాల వారీగా టెస్టులు, డెత్స్​ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

 

తెలంగాణలో ప్రస్తుతం రోజు 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల్లోనూ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వందల కొద్దీ కరోనా కేసులు నమోదవుతున్నా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ అరకొరగానే టెస్టులు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఆగస్టులో 4,270 టెస్టులు, వికారాబాద్ జిల్లాలో 5,268 టెస్టులు మాత్రమే చేసినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోనే ఉంది. మొత్తం 33 జిల్లాలకుగాను 27 జిల్లాల్లో రోజూ వెయ్యి కంటే తక్కువే టెస్టులు చేసినట్టు కేంద్రం వెల్లడించిన నివేదికతో వెల్లడైంది. స్టేట్‌‌‌‌ బులెటిన్‌‌‌‌లో రోజూ రాష్ట్రవ్యాప్తంగా 50 వేల నుంచి 60 వేల టెస్టులు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అయితే ఏ జిల్లాలో ఎన్ని చేశారో చెప్పడం లేదు. దీంతో అన్ని టెస్టులు చేస్తున్నారా, చేయకుండానే చేసినట్టుగా చూపిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

టెస్టుల సంఖ్యే కాదు.. కరోనా కేసులు, మరణాల్లో కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలే చెబుతుందని క్షేత్రస్థాయిలో పనిచేసే డాక్టర్లు, జిల్లాల మెడికల్ ఆఫీసర్లే చెప్తున్నారు. రోజూ నమోదవుతున్న కేసులు, డెత్స్​లో సగం కూడా బయటపెట్టడం లేదని అంటున్నారు. అసలు లెక్కలు బయటపడకుండా ఉండేందుకే జిల్లాల్లో బులెటిన్లు  ఇవ్వొద్దని ఆదేశించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

 

మరోవైపు కరోనా టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ సూచనలను రాష్ట్ర సర్కారు‌‌‌‌ పాటించడం లేదు. కరోనా లక్షణాలున్నవాళ్లకు యాంటీ జెన్ టెస్టులో నెగెటివ్ వస్తే.. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌‌‌‌ చేయడం లేదు. యాంటీ జెన్‌‌‌‌ టెస్టులో ఫాల్స్‌‌‌‌ నెగెటివ్‌‌‌‌ వచ్చే అవకాశాలు 40 శాతం దాకా ఉందని ఐసీఎంఆర్ మొదట్నుంచీ చెప్తూనే ఉంది. లక్షణాలుండి యాంటీజెన్​లో నెగెటివ్ వస్తే.. ఆర్టీపీసీఆర్ చేయించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో యాంటీ జెన్ టెస్టులు చేసి వదిలేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని బాధితులు చెప్తున్నారు. రాష్ట్రంలో రోజూ 6 వేలదాకా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే కెపాసిటీ ఉన్నా.. అందులో సగం కూడా చేయడం లేదని హెల్త్​ డిపార్ట్​మెంట్​ వర్గాలు చెప్తున్నాయి.

 

కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై గతంలో చాలా సార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా అంశంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని అభిప్రాయపడింది. కేసులు, మరణాలు చాలా తక్కువగా రిపోర్టు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం నిర్లిప్తత, ప్రైవేట్ ఆస్పత్రులు కట్టడి విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వంపై ఘాటైన కామెంట్లు చేసింది, కరోనా కేసులు, మరణాలను తక్కువగా చూపుతున్నారని అభిప్రాయపడింది. సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజారోగ్య రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాకి ముందు ఎంత నిధులు కేటాయించారు, కరోనా తర్వాత ఎంత కేటాయించారనే అంశాలను తెలియజేయాలని కోరింది.