పిల్లల విషయంలో గొడవ..ఎనిమిది మంది కాల్చివేత

అమెరికా మరోసారి తుపాకీ గర్జనతో మారుమోగింది. మసిసిపీ రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. లింకన్ కౌంటీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న బ్రూక్‌హవెన్, బొగ్యు చిట్టొల్లో పిల్లల విషయమై భార్య, ఆమె తల్లిదండ్రులతో గొడవ పడ్డ కోరీ గాడ్‌బోల్ట్ ఈ దురాగతానికి పాల్పడ్డాడు..అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడిన గాడ్‌బోల్ట్..తన పిల్లల కోసం తాను అక్కడికి వచ్చానని..వారిని తనతో పాటు తీసుకెళ్తానని భార్య, అత్తమామలతో మాట్లాడుతున్నానని..ఎవరో పోలీసులకు సమాచారం అందించారన్నాడు. సంబంధం లేని వారు జోక్యం చేసుకోవడంతో ఆగ్రహంతో వారిని చంపానన్నాడు. మృతుల్లో ఓ పోలీస్ అధికారి, ఇద్దరు చిన్నారులు, మరో  ఐదుగురు ఉన్నారు. కాగా..నిందితుడికి గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది.