కేసీఆర్ కన్పించకపోతే వచ్చే నష్టమేంటి? పాలన ఆగిందా? పథకాలు ఆగాయా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు? అంటూ కొద్దిరోజులుగా విపక్షాలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం ఎక్కడున్నారో చెప్పాలని, సీఎం ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేయాలనీ కోరుతున్నారు. సామాన్యులు సైతం సీఎం ఎక్కడున్నారు? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఒక యువకుడు అయితే.. 'మా సీఎం ఎక్కడున్నాలరో చెప్పాలి?' అంటూ ప్లకార్డ్ ని పట్టుకొని ప్రగతిభవన్ ముందు ప్రదర్శించాడు. మొత్తానికి సీఎం ఎక్కడున్నారు అనే అంశం ప్రస్తుతం తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ అంశంపై మంత్రుల స్పందన మాత్రాన వెరైటీగా ఉంది. సీఎం ఎక్కడుంటే మీకెందుకు? పనులు ఆగాయా? పథకాలు ఏమన్నా ఆగాయా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ తలసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి? సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా? ప్రభుత్వ పథకాలు ఆగాయా? అని తలసాని ప్రశ్నించారు.

ఇక, సచివాలయం కూల్చివేత, కరోనా కట్టడిలో విఫలమంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా తలసాని విరుచుకుపడ్డారు. పరిపాలనలో సచివాలయం ఒక భాగం. కొత్త సచివాలయం కడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడున్నాడు అంటూ కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. బీజేపీ నాయకులకు చేతనైతే.. ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలి అన్నారు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం ఎందుకని మేము ప్రశ్నించామా? అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో బీజేపీ నేతలు చెప్పాలి అని తలసాని ప్రశ్నించారు.