ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన.. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది : మంత్రి శోభా కరంద్లాజే
Published on: Sun Jun 14, 2026 10:49AM

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ‘వికసిత్ భారత్’ లక్ష్య దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు.
ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు.
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన శోభా కరంద్లాజే, దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేలా ఆశీర్వదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత బలంగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.


