మరి మీ షూటింగులకు ఇది సరైన సమయమా.. పవన్ పై ఏపీ మంత్రి ఫైర్
posted on Aug 1, 2020 2:16PM
ఏపీ గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో రాజకీయ రచ్చ మాములుగా లేదు. దీని పై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సరైన సమయం కాదని ముందుగా కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు.
తాజాగా పవన్ కామెంట్స్ పై స్పందించిన ఏపీ మంత్రి శంకర్ నారాయణ జనసేన పార్టీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైనా తీవ్ర విమర్శలు చేశారు. అసలు జనసేన పార్టీ జనం కోసం చేసింది ఏమీలేదని, అది ఒక పనికిమాలిన సేన అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మూడు రాజధానులకు ఇది సరైన సమయం కాదని పవన్ కల్యాణ్ అంటున్నారని, మరి ఇది షూటింగులకు సరైన సమయమా? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గానీ, జనసేన గానీ ఉన్నది ప్యాకేజీ కోసం తప్ప ప్రజల కోసం కాదని అయన తీవ్రంగా విమర్శించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.