జగన్ కి పంచ్.. 'అబద్దం- నిజం' బై నారా లోకేష్!!

 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ మంత్రి లోకేష్ దూకుడు పెంచారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు ధీటైన సమాధానం చెప్తూ తిప్పికొడుతున్నారు. ఏపీ పోలీసు శాఖలో ఒకే సామజికవర్గానికి చెందిన వారికి పదోన్నతలు ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను అవమానించేలా మాట్లాడారని ఇలా రకరకాలుగా వైసీపీ టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా లోకేష్ వీటన్నింటికీ సమాధానం చెప్పి వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. జగన్ - మోదీ ద్వయం కుల రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. చింతమనేని విషయం మొదలుకొని రైతు కోటయ్య మృతి, పోలీస్ శాఖ పదోన్నతుల వరకు అన్నింటిని ఉదాహరణగా చూపిస్తూ.. కులాల పేరుతో ఏపీని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారని ఆరోపిస్తూ.. అబద్ధం - నిజం అంటూ వరుస ట్వీట్లు చేశారు.

జగన్ - మోడీ కుల రాజకీయం:  ఏపీ పోలీస్ శాఖలో 37 మందికి డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ, 35 మంది కమ్మ వారిని ముఖ్యమంత్రి తీసుకున్నారని ఢిల్లీలో జగన్ ఆరోపించారు.
నిజం - 2018 వరకు ప్రమోషన్ ప్యానెల్ లో ఉండి ప్రస్తుతం సూపర్ న్యూమరీ పోస్టుల్లో కొనసాగుతున్న 35 మందిలో బీసీలు 9మంది, రెడ్లు ఏడుగురు, ఎస్సీలు ఏడుగురు, బలిజ/కాపు వర్గీయులు నలుగురు, ముస్లిం మైనారిటీలు ఇద్దరు, కమ్మ వర్గీయులు ఇద్దరు, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ, ఎస్టీలు ఒక్కొక్కరు ఉన్నారు.

 

 

జగన్ - మోడీ కుల రాజకీయం: కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై ట్వీట్ చేస్తూ, కోటయ్యను ఒక బీసీ(ముత్రాసి) రైతు అని నొక్కి చెప్పారు జగన్. మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం జగన్ కే చెల్లింది.
నిజం - కొట్టి కొనఊపిరితో ఉన్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారని ట్వీట్ చేస్తూ మీరే చంపేశారని చంద్రబాబుగారి మీద, పోలీసుల మీద నింద వేసిన జగన్.. ఈ ఫొటోలో రైతు ప్రాణం కాపాడేందుకు భుజాల మీద తీసుకెళ్తున్న పోలీసులు ఎవరు?  మోడీ పంపారా?

 

 

జగన్ - మోడీ కుల రాజకీయం: చింతమనేని ప్రసంగాన్ని కావలసినంత వరకే ఎడిట్ చేసి దళితులను అవమానించారంటూ జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారు.
నిజం - చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు?  వీడియోలో చింతమనేని మాటలకు వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారు. తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా జగన్ గారు?.

 

 

'పదే పదే కుల ప్రస్తావన తెస్తూ, కులాల చిచ్చుతో ఏపీని అస్థిరపరచాలని చూస్తున్న జగన్ వెనుక, రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని కెసిఆర్, మోడీల పాత్ర స్పష్టమవుతోంది. తెదేపాను దెబ్బతీసేందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వం. ప్రజలకు మీ కుట్రలు అర్థమైన నాడు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.' అని ట్వీట్ చేసారు.